Find Articles

జ్ఞాపకాల తీరంలో ‘కాగితం పడవలు’.. సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్!

వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం కాగితం పడవలు. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్‌కు విశేష స్పందన లభించగా, తాజాగా చిత్రబృందం సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక కాలువలో మొదలై.. సముద్రమంత ప్రయాణమైంది!

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే థియేటర్ల వరకు తీసుకురావడమే పెద్ద సవాలు. ఒక చిన్న కాలువలో మొదలైన మా ప్రయాణం ఊహించకుండానే ఒక పెద్ద సముద్రంలోకి తీసుకెళ్లింది. మేకర్స్ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. డైరెక్టర్ తుకారాం గారు ఈ ఎమోషనల్ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోయే అందమైన ప్రేమకథ ఇది” అని తెలిపారు.

ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రేమ కథే ఇది!

దర్శకుడు ఎంజీఆర్ తుకారాం మాట్లాడుతూ.. నిర్మాతులే ఈ సినిమాకు అసలైన హీరోలని కొనియాడారు. “మన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక తీపి జ్ఞాపకం లాంటి ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీ పాత జ్ఞాపకాలు, మీ ప్రేమకథ ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. సెప్టెంబర్ 18న అందరూ థియేటర్లలో చూసి ఆస్వాదించాలి” అని కోరారు.

హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ… తెలుగులో ఇది తన రెండవ నటన అని, ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ చిత్రంలో మంచి పాత్ర దక్కినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.

సెప్టెంబర్ 18న థియేటర్లలో సందడి!

ఈ చిత్రానికి ఎఐఎస్ నౌఫల్ రాజా సంగీతం అందించగా, రుద్రసాయి ఛాయాగ్రహణం అందించారు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కంటెంట్ ఆధారిత చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని, ‘కాగితం పడవలు’ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.

Keerthi