కోలీవుడ్ ప్రతిభావంతుడైన దర్శకుడు పీఎస్ మిత్రన్ కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రాజెక్ట్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కార్తి హీరోగా మిత్రన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ పీఎస్ మిత్రన్, యశ్కు చెప్పిన మైండ్ బ్లోయింగ్ కథ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటూనే.. పరోక్షంగా ఆయన ఎంపికను విమర్శించారు.
ఇండియానా జోన్స్ లాంటి కథను వదులుకున్న యశ్!
పీఎస్ మిత్రన్ మాట్లాడుతూ.. “నేను యశ్కు ఒక ఎపిక్ అడ్వెంచర్ స్టోరీ వినిపించాను. అందులో చాలా బలమైన ఎమోషన్స్ ఉన్నాయి. హాలీవుడ్ క్లాసిక్ ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఉండే ఒక అద్భుతమైన డ్రీమ్ ప్రాజెక్ట్ అది. కానీ, ఆ సమయంలో యశ్కి డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. అయితే.. ఎమోషన్స్ లేని, కేవలం అడల్ట్ కంటెంట్తో ఉండే గ్యాంగ్స్టర్ కథలను ఎంచుకోవడం కంటే, ఇలాంటి బలమైన భావోద్వేగాలున్న అడ్వెంచర్ సినిమాలు చేసి ఉంటే బాగుండేది” అని బాంబ్ పేల్చారు.
మిత్రన్ చేసిన ఈ కామెంట్స్ నేరుగా ఇటీవల విడుదలైన ‘టాక్సిక్’ ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు.
రూ. 150 కోట్ల డీల్ రిజెక్ట్ చేస్తే.. రూ. 30 కోట్లకి పడిపోయిన OTT డిమాండ్!
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘టాక్సిక్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ రావడం, కలెక్షన్లు దెబ్బతినడంతో ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ (OTT Deal) విషయంలో మేకర్స్కు గట్టి షాక్ తగిలింది.
సినిమా రిలీజ్కు ముందు ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్ ఏకంగా రూ. 150 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే, సినిమా థియేటర్లలో రూ. 500 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఏకంగా రూ. 200 కోట్లు డిమాండ్ చేస్తూ ఆ ఆఫర్ను తిరస్కరించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద సినిమా డిజాస్టర్ అవ్వడంతో, ఇప్పుడు అదే ఓటీటీ ప్లాట్ఫామ్స్ రూ. 30 కోట్లకు మించి ఇచ్చేది లేదని మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ ఎంపికలో పొరపాటు వల్ల అటు క్రేజ్, ఇటు వందల కోట్ల భారీ డిజిటల్ బిజినెస్ రెండూ గంగలో కలిసాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.